ఆంధ్ర-తెలంగాణలకు తగవు పెట్టాలనుకుంటున్నారా..? కేంద్రానికి పవన్ ప్రశ్న

శుక్రవారం, 5 మే 2017 (18:39 IST)
మిర్చి రైతు సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని నిలదీశారు. మిర్చి కొనుగోలు విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ద్వంద్వ విధానాలను పాటిస్తున్నారంటూ మండిపడ్డారు. బహిరంగ లేఖ ద్వారా ఆయన పలు విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మిర్చి కొనుగోలులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో విధానాన్ని పాటించడం సమంజసం కాదని విమర్శించారు. 
 
మిర్చికి కేంద్రం రూ.5 వేలు మద్దతు ధర ప్రకటించడం శోచనీయమన్న పవన్, రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వాలు ఆదుకోవాలే కానీ తప్పించుకోకూడదని హితవు పలికారు. రైతులను అటు కేంద్రం ఇటు రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తలకు కోట్లు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వాలు రైతుల విషయం వచ్చేసరికి ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మిర్చి కొనుగోళ్లు ఏపీలో 88,300 మెట్రిక్‌ టన్నులు కొంటూ, తెలంగాణలో 33,700 మెట్రిక్‌ టన్నులే ఎందుకు తక్కువ కొనుగోలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లోనూ సమానంగానే కొనుగోళ్లు వుండేట్లు చూడాలన్నారు. ఇలా తారతమ్యం చూపించడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య తగవు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి