విశాఖపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. మండలి విషయంలో చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడారని, రాజకీయాల కోసం చంద్రబాబు ఏదైనా మాట్లాడతారని విమర్శించారు.
జీఎన్ రావు, బోస్టన్ కమిటీ రిపోర్టులను హైపవర్ కమిటీ పరిశీలించాకే ప్రభుత్వం మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. శివరామకృష్ణ కమిటీ గురించి మీరు పట్టించుకున్నారా? అంటూ చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స ఉద్ఘాటించారు.
తుపాను ముప్పులేకుండా ఏ నగరమైనా ఉంటుందా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చెన్నై, ముంబైలకు తుఫాను ముప్పులేదా? అని అన్నారు. విశాఖకు తుఫాన్ ముప్పు ఉన్న సంగతి తెలుసునని, అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందన్నారు. విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ చేపడతామన్నారు.
ల్యాండ్ పూలింగ్కు ముందుకొచ్చిన వాళ్ల భూమి తీసుకుంటామని తెలిపారు. విశాఖలో లక్షా 75వేల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని మంత్రి తెలిపారు. మండలితో రాజధానికి ముడిపెట్టడం సరికాదని విపక్షాలకు హితవుచెప్పారు. అన్ని వర్గాలు, ప్రాంతాల శ్రేయస్సు కోసమే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.