సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకునేందుకు వచ్చా : పవన్ కళ్యాణ్

ఠాగూర్

గురువారం, 3 అక్టోబరు 2024 (18:42 IST)
దశాబ్దానికి పైగా తనను వ్యక్తిగతంగా దూషించారని, అవమానించారనీ, ఎంతో పరాభవించారనీ, అయినా ఎవర్నీ ఏమీ అనలేదనీ, అలాంటి కోటాను కోట్ల మందికి ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం..? అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అన్నీ రాజకీయాలేనా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా..? సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకునేందుకే ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. 
 
గురువారు తిరుపతి బాలాజీ నగర్‌లో పవన్‌ కల్యాణ్‌ వారాహి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో వారాహి డిక్లరేషన్‌‌ను ఆయన ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి ఎలా అన్నదానిపైనే ఫోకస్‌ పెట్టాం. పగ, ప్రతీకార రాజకీయాలుండవని గెలవగానే చెప్పాం. దశాబ్దానికి పైగా నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, అవమానించారు. నన్ను ఎంతో పరాభవించారు.. అయినా ఎవర్నీ ఏమీ అనలేదు. వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం..? అన్నీ రాజకీయాలేనా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా..? 
 
నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని కోరుకున్నా. వైసీపీ నేతలే ఈ పరిస్థితిని తీసుకొచ్చారు. నాకు అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. కల్తీ ప్రసాదాలు పెట్టారు.. వెంకన్నకు అపచారం చేశారు. సనాతన ధర్మానికి అపచారం చేస్తూనే వచ్చారు. భరించాం.. భగవంతుడు వారిని 11 సీట్లకు కుదించినా బుద్ధిరాలేదు. ఉపముఖ్యమంత్రిగానో, జనసేన అధ్యక్షుడిగానో నేను ఇక్కడకు రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
భారతీయుడిగా, హైందవ ధర్మాన్ని పాటించేవాడిగా మీ ముందుకొచ్చా. హిందుత్వాన్ని పాటిస్తా.. అన్ని మతాలను గౌరవిస్తా. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మం. ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగింది. ప్రాయశ్చిత దీక్ష చేపడితే దాన్ని అపహాస్యం చేసారు. నా సనాతన ధర్మాన్ని నేను పాటించడం కూడా వారికి పాపంలా కనిపిస్తోంది. సనాతన ధర్మంపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను. దానికోసం నా పదవి, నా జీవితం, రాజకీయ జీవితం పోయినా బాధపడను. నేను ఎప్పుడూ ధర్మం తప్పలేదు అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు