అండమాన్ నికోబార్ ఎన్నికలు: సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ

మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (16:31 IST)
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో జరిగిన నగర పాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. తద్వారా జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత టీడీపీ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 24 వార్డులకు జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 10 వార్డుల్లో అగ్రస్థానంలో నిలువగా.. కాంగ్రెస్ పార్టీకి ఆరు వార్డులు దక్కాయి. 
 
ఇక తెలుగుదేశం పార్టీకి రెండు వార్డులు సొంతం కాగా, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు చెరో వార్డు చొప్పున గెలుచుకున్నాయి. ఇతర పార్టీలు నాలుగు స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇక బీజేపీ 10 స్థానాల్లో గెలువగా, తెలుగుదేశం పార్టీకి ఇద్దరు సభ్యులు ఉండటంతో, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు సాయంతో నగర పాలక పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
 
అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగుదేశం పార్టీ రెండు వార్డుల్లో సత్తాచాటడం పట్ల ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ హోదాలో తెలుగుదేశానికి దక్కిన తొలి విజయం ఇదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో త్వరలోనే మరిన్ని ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరిస్తుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి