స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యువతపై ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా తల్లి సెల్ ఫోన్ పోగొట్టిన భయంతో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్ నార్త్ బాలాజీహిల్స్ వాసి బొల్లు శ్రీనివాస్ కుమారుడు వరుణ్రాజ్(19) బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
గురువారం సాయంత్రం ఉప్పల్ భరత్నగర్లోని స్నేహితుడు రాబర్ట్ ఇంటికి తండ్రి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. వాహనం తాళంచెవి స్నేహితుడికి ఇచ్చాడు. అవసరం ఉందని అతడి వద్ద రూ.100 తీసుకొని బజారుకెళ్లాడు. తాడు కొనుక్కొచ్చి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బజారుకెళ్లిన స్నేహితుడు తిరిగి రాలేదని రాబర్ట్ వెతికినా ఎక్కడా కనబడలేదు.
శుక్రవారం ఉదయం తన ఇంటి సమీపంలోనే భవనంపై వరుణ్రాజ్ ఉరేసుకున్నట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి జేబులో లభించిన లేఖలో తల్లి చరవాణి పోగొట్టడంతోనే మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసినట్లు పోలీసులు తెలిపారు. అమ్మా క్షమించు.. సెల్ ఫోన్ పోగొట్టాను.. నాన్న టూ వీలర్.. నా ఫ్రెండ్ దగ్గరుంది అంటూ ఆ లేఖలో వరుణ్ రాజ్ రాశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.