ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్.. ఆకాశంలో ప్రైవేట్ బస్సు టిక్కెట్ ధరలు

మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:22 IST)
'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అనే సూత్రాన్ని ట్రావెల్ సంస్థలు ఇప్పుడు తూచాతప్పకుండా పాటిస్తున్నాయి. వారి స్వప్రయోజనం కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఎన్నికల నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని టిక్కెట్ రేట్లను అమాంతంగా పెంచేశారు. ఓటు వేయడానికి ఇతర ప్రదేశాల నుంచి స్వస్థలానికి వెళ్లే ప్రయాణీకుల నుండి డబ్బులు దండుకుంటున్నారు.
 
ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఓటేయడానికి వెళ్తున్న వారి జేబులను ప్రైవేట్ బస్సుల వాళ్లు ఖాళీ చేస్తున్నారు. సాధారణంగా రూ.500 ఉండే టిక్కెట్ ధరను రూ.1000కి పెంచేశారు. కొన్ని బస్సులలో అయితే రూ.1200 నుంచి రూ.1500 వరకు పెంచేశారు. 
 
బుకింగ్‌ల సంఖ్య పెరిగేకొద్దీ రేటు కూడా పెరుగుతోంది. దానికి తోడు డిమాండ్ అధికంకావడంతో ధరకు అడ్డుకట్ట వేసేవారు లేకపోయారు. ఈ విషయంలో ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోవాలి. ఓటు వేయడం మీ బాధ్యత అని ఈసీ గట్టిగా చెబుతూ ఉంటుంది. ఆ బాధ్యను నెరవేర్చడానికి వందల కిలోమీటర్ల ప్రయాణించే వారికి చాలా ఇబ్బంది కలుగుతోంది. మంగళ, బుధవారాల్లో భారీ సంఖ్యలో ప్రయాణీకులు ఉంటారు. ఈసీ చొరవ చూపి దీనిపై చర్య తీసుకుని టిక్కెట్ రేటు న్యాయబద్ధంగా ఉండేలా చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు