చంపడమో.. చావడమో... జగన్ కనుసైగ చేస్తే : నోరుజారిన వైకాపా అభ్యర్థి

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:08 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో భాగంగా, నెల్లూరు పట్టణ అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా వైకాపా తరపున పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ నోరు జారారు. ఈ ఎన్నికల తర్వాత వైకాపా జెండా ఎగరాల్సిందేనంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్న సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా ఆవేశానికి గురయ్యారు. ఆయన నిగ్రహం కోల్పోయి నోరుజారారు. ఈ ఎన్నికల్లో చంపడమో... చావడో.. విజయమో.. వీరస్వర్గమో తేలిపోవాలన్నారు. జగన్ కనుసైగ చేస్తే నిమిషాల్లో అంతా కనుమరుగైపోతారని హెచ్చరించారు.
 
పార్టీ శ్రేణుల సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి  దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, నెల్లూరు సిటీ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి. నారాయణ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో అనిల్ కుమార్ యాదవ్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే ఆయన నిగ్రహం కోల్పోయి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు