వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి! నేమ్ ప్లేట్ రెడీ

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. మే నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం పోలింగ్‌తో ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. కొన్నిపాటి చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 
 
అయితే, ఫలితాలు తెలియాలంటే మాత్రం మే 23వ తేదీ వరకు వేచిఉండాల్సిందే. మరోవైపు గెలుపుపై అటు తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ ధీమా కనిపిస్తోంది. తిరిగి అధికారంలోకి వస్తామంటున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక ప్రమాణస్వీకారం చేయడమే మిగిలింది అనే నమ్మకంతో ఉన్నారు. 
 
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కూడా.. జగనే సీఎం.. ఏపీకి బెస్ట్ సీఎంగా పనిచేయాలంటూ అభినందనలు తెలిపారు. ఇదంతా ఒకవైపు.. మరోవైపు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి' అంటూ తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు