గాజువాకలో చంద్రబాబుపైకి దూసుకొచ్చిన రాయి, తెనాలిలో పవన్ కల్యాణ్ పక్కన పడ్డ రాయి

ఐవీఆర్

ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (22:25 IST)
శనివారం నాడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు చేసిన రాళ్ల దాడిలో ఆయన కంటి పైన గాయమైంది. ఇదిలావుండగానే తాజాగా ఆదివారం నాడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైన ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఐతే వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు విశాఖ గాజువాకలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు పైన గుర్తుతెలియని దుండగుడు రాయి విసిరాడు. ఆ రాయి పక్కనే పడింది. దీనితో పోలీసులు రాయి విసిరిన వైపుకి వెళ్లి గాలించారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
రాళ్లు విసిరిన ఘటనలకు సంబంధించి చంద్రబాబు మాట్లాడుతూ... శనివారం రాత్రి సీఎం పైన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గులకరాయి విసిరాడు. ఆ సమయంలో కరెంటు లేదు. కరెంటు ఎందుకు తీసారో వారిపై చర్యలు తీసుకోవాలి. రాయి వేసిన వ్యక్తి ఎవరో పోలీసులు పట్టుకునే ప్రయత్నించాలి. ఆ సంగతి కూడా తేలుస్తా. ఇప్పుడు నాపై కరెంటు వుండగానే రాయి విసిరారు.
 
గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచులు పనిచేస్తున్నాయి. తెనాలిలో పవన్ పైన రాళ్లు విసిరారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు. మీ ప్రభుత్వమే కదా వున్నది. చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు. దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు, జగన్ గతంలో కూడా కోడికత్తి డ్రామా ఆడారు. ఆ తర్వాత తన బాబాయి హత్య నాపైకి నెట్టేందుకు ప్రయత్నించాడు. నేను నేరాలు చేయను. నేరాలు చేసేవారిని పాతాళానికి తొక్కుతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు