వరంగల్లోని ఓ పాఠశాలలో చదువుతోన్న ఆరేళ్ల సౌమ్య 20 ఎక్కాలను పైనుంచి క్రిందకు, పైనుంచి క్రిందకు చదవగలుగుతుంది. అదే పాఠశాలలోని తొమ్మిదేళ్ల అగస్తేశ్వర్ 1500 జనరల్ నాల్డెజ్ ప్రశ్నలకు పొల్లుపోకుండా జవాబులు అప్పజెప్పుతాడు. పదకొండేళ్ల మాఘక్ వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపిస్తాడు. ఆ పాఠశాలలోని గణేశ్ 70 దేశాల రాజధాని పేర్లను చక్కగా చెప్పేస్తాడు.
ఇవన్నీ చదివి ఇందులో పెద్ద గొప్పేముంది అనుకోవద్దు. ఇలా చెప్పగల్గుతోంది మామూలు పిల్లలు కాదు. వీళ్లంతా పుట్టుకతో అంధులు. వరంగల్లోని 'స్పెస్' అనే అంధుల పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులే వీరంతా. ప్రస్తుత సమాజంలో డబ్బుధ్యేయంగా పాఠశాలలు స్థాపించి దానిని ఓ లాభసాటి వ్యాపారంగా చూస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి తరుణంలో అందుకు భిన్నంగా సేవ చేయాలనే మంచి ఉద్ధేశ్యంతో 'స్పెస్' స్వచ్ఛంద సంస్థను బి. శోభా భాస్కర్ ప్రారంభించడం నిజంగా అభినందించాల్సిన విషయం.
దారిద్రరేఖకు దిగువన ఉన్న అంధ బాలబాలికలకు ఈ పాఠశాల ద్వారా ప్రాథమిక తరగతుల్లో బ్రెయిలీ లిపి ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. ఈ పాఠశాలలోని అంధ విద్యార్ధులకు బోధించే ఉపాధ్యాయులు సైతం అంధత్వం కలవారు కావడం విశేషం. ఉపాధ్యాయులకు మరియు అంథ విద్యార్ధులకు నిర్వాహకులే ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేస్తున్నారు.
అంధ పిల్లల కోసం ఈ సంస్థ చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం ఇటీవలి కాలంలో పాఠశాల నిర్వహణకు భవన వసతి కల్పించింది. అలాగే శ్రీ గణపతి సచ్ఛిదానంద స్వామి విద్యార్ధుల ఉపయోగార్థం బ్రెయిలీ ప్రింటర్ను అందజేశారు. అయితే దాతలు ఇచ్చిన అరకొర విరాళాలు సరిపోని ఈ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ప్రభుత్వం నుంచి వస్తోన్న డబ్బులు సరిపోక సంస్థ నిర్వహాణ భారంగా మారింది. విద్యార్ధులకు వైద్యం అందించడం సైతం కష్టంగా మారింది. పిల్లలు నేర్చుకునే బ్రెయిలీ ప్రింటర్ ఒకటే ఉండండంతో అభ్యసనానికి కష్టంగా ఉంది. ప్రారంభంలో ఎనిమిదిమందితో ప్రారంభమైన ఈ అందుల పాఠశాల నేడు 80మందితో కొనసాగుతోంది. అయితే పెరిగిన విద్యార్ధుల సంఖ్యకు సరిపోయేంత నిధులు లేక సంస్థ కష్టాలను ఎదుర్కొంటోంది. అందుకే దయతో ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఈ స్పెస్ అంధుల పాఠశాల ఎదురుచూస్తోంది.