ప్రైవేట్ పరం చేస్తే లగడపాటి తాటతీస్తాం : వల్లభనేని వంశీ
శుక్రవారం, 2 మార్చి 2012 (17:55 IST)
File
FILE
కృష్ణా జిల్లాలోని భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ పరం చేస్తే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాట తీస్తామని తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ హెచ్చరించారు. దీనిపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ... లగడపాటి స్థానిక సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భవానీ ద్వీపం టెండర్లు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
భవానీ ద్వీపం కాంట్రాక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. భవానీ ద్వీపంలో స్టార్ హోటళ్లు నిర్మిస్తే నదీ జలాలు కలుషితం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవానీ ద్వీపాన్ని ప్రైవేటీకరిస్తే లగడపాటి తాట తీస్తామని, తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
ఇప్పటివరకు విజయవాడ పట్టణానికి అధికార పార్టీ సభ్యుడిగా ఉండి ఒక్క రైలును తీసుకు రాలేక పోయారన్నారు. లగడపాటి రాజగోపాల్కు దమ్ముంటే విజయవాడ పట్టణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఆయన సిద్ధం కాని పక్షంలో తాను చేసిన అభివృద్ధిని పుస్తక రూపంలో ప్రచురించాలని ఆయన హితవు పలికారు.