అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

ఠాగూర్

మంగళవారం, 15 జులై 2025 (18:15 IST)
ఓ సినిమా స్టంట్ సీన్ చిత్రీకరణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జరగాని నష్టం జరిగిపోయిందని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ అన్నారు. ఆర్యో హీరోగా తాను తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో స్టంట్ ఆర్టిస్ట్ ఎం.రాజు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆయన మృతిపై పా.రజింత్ సొంత నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్ విచారం వ్యక్తం చేస్తూ ఓ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది.
 
'జులై 13న ప్రతిభావంతుడైన స్టంట్‌ ఆర్టిస్ట్‌, మాతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సహచరుడు మోహన్‌రాజ్‌ను కోల్పోయాం. ఆయన మరణ వార్త తెలియగానే మా హృదయం బద్దలైంది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, రాజు అన్నను ప్రేమించేవాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. 
 
ఆ రోజు ఉదయం పక్కా ప్రణాళికతోనే షూటింగ్‌ను ప్రారంభించాం. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఏ సన్నివేశం ఎలా తీయాలో స్పష్టంగా ఉన్నాం. అంతా మంచి జరగాలని ప్రతి మూవీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ప్రార్థిస్తాం. ఈ షూటింగ్‌ విషయంలోనూ అలాగే చేశాం. కానీ, అనుకోని విధంగా ఒకరు కన్నుమూశారు. ఆ సంఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది'
 
'మోహన్‌ అన్న అంటే స్టంట్‌ టీమ్‌తో పాటు, మొత్తం చిత్ర బృందం కూడా ఎంతో గౌరవిస్తుంది. స్టంట్స్‌ డిజైన్‌, ప్లానింగ్‌, అమలు ఇలా అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన. స్టంట్‌ డైరెక్టర్‌ దిలీప్‌ సుబ్బరాయన్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుని, రక్షణ చర్యలు తీసుకుని షాట్‌ మొదలు పెట్టారు. 
 
అన్ని చేసినా, మేము ఒక అసమాన ప్రతిభావంతుడైన వ్యక్తిని కోల్పోయాం. కుటుంబంతో పాటు, సహచరులు, దర్శకులు గర్వపడేలా ఆయన పనిచేసేవారు. ఆయన పట్ల మా ప్రేమ, అభిమానం, ఆరాధన కొనసాగుతుంది. ఆయన ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో నిలిచి ఉంటారు' అని పా.రంజిత్‌, ఆయన నిర్మాణ సంస్థ నీలమ్‌ ప్రొడక్షన్స్‌ విచారం వ్యక్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు