సెవెన్‌ హిల్స్ మారథాన్‌కు తిరుపతి రెడీ... నడకపై అవగాహన కోసం...

శనివారం, 22 అక్టోబరు 2016 (12:53 IST)
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతి మారథాన్‌కు సిద్ధమైంది. ఇప్పటివరకు మెట్రో సిటీలలో మాత్రమే నిర్వహించిన మారథాన్‌ను తొలిసారి తిరుపతిలో నిర్వహించనున్నారు. డీప్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 10వేల మందికిపైగా యువత మారథాన్‌లో పాల్గొననున్నారు.
 
ప్రతి ఒక్కరు నడక అలవాటు చేసుకోండి.. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి అంటూ వైద్యులు ఎప్పుడూ సూచిస్తుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి వ్యాయామం చేయడం ద్వారా వైద్యులు దగ్గరకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటుంటారు. అయితే ఎవరో కొంతమంది తప్ప మిగిలిన వారు ఎవరూ కూడా వ్యాయామం జోలికెళ్ళరు. 
 
అలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మారథాన్‌ పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందరు నడక అలవాటుచేసుకోవాలని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే వైజాగ్‌, అమరావతి ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. తొలిసారి టెంపుల్‌ సిటీ తిరుపతిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మారథాన్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. 
 
తారకరామ స్టేడియం ఇందుకు వేదికైంది. ఇప్పటికై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి మారథాన్‌కు సంబంధించిన టిషర్టులను విడుదల చేశారు. మారథాన్‌లో పరిగెత్తే వారి మోసం చేయాలని ప్రయత్నిస్తే ఈజీగా కనిపెట్టేస్తారు నిర్వాహకులు. డీప్‌ ఆర్గనైజేషన్‌ తయారుచేసిన టీషర్టులకు ఒక చిప్‌ను అమరుస్తున్నారు. అందులో వేగాన్ని గుర్తించే అవకాశముంది. దీంతో మారథాన్‌లో పాల్గొనే వారు పరుగెత్తి బహుమతిని గెలవక తప్పదు.

వెబ్దునియా పై చదవండి