8 యేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం

సోమవారం, 30 ఏప్రియల్ 2018 (08:52 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని విద్యానగర్‌లో ఈ నెల 24న జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న బాలికను ఆరో తరగతి చదువుతున్న 10 - 12 ఏళ్ల వయసున్న ఐదుగురు బాలురు సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
బాధిత కుటుంబం కొద్ది నెలల కిందటే బతుకుదెరువు కోసం క్రోసూరు మండలం నుంచి నగరానికి వలస వచ్చి విద్యానగర్‌లో నివాసం ఉంటోంది. బాలిక తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా, తల్లి ఇళ్లలో పాచి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 
 
తమ కుమార్తె కనిపించకపోవడంతో తల్లి, బాలిక అక్క వెతుక్కుంటూ వెళ్తుండగా చెట్ల పొదల్లో అలికిడి కావడంతో అక్కడకు వెళ్లారు. వారిని చూసి బాలురు పరార్‌ కాగా బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక, ఫోక్సో తదితర చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు