తితిదే ఈవోగా అనిల్ కుమర్ సింఘాల్.. సాంబశివరావుకు కీలక శాఖ అప్పగింత
మంగళవారం, 2 మే 2017 (09:24 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ స్థానంలో ఇప్పటివరకు ఉన్న డాక్టర్ డి.సాంబశివరావును కీలకమైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
తితిదే ఈవోగా సాంబశివరావు పదవీకాలం ముగియడం, రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారుల అవసరం ఎక్కువగా ఉండటంతో ఆయనను బదిలీ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీలకమైన విభాగాల బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. చాలాకాలంగా కేంద్ర సర్వీసులో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను మళ్లీ రాష్ట్ర సర్వీసులోకి తీసుకొచ్చి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమించారు. ప్రవీణ్ప్రకాష్ బాధ్యతలు చేపట్టేంత వరకు ప్రస్తుతం ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్గా ఉన్న అర్జా శ్రీకాంత్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు.
అలాగే, కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసిన బాబుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ ఎండీగా నియమించారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న ఐఆర్టీఎస్ అధికారి కె.సాంబశివరావుని ఆయన విజ్ఞప్తి మేరకు బదిలీ చేశారు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కారణాల వల్ల తనకు ఏడాదిపాటు పని ఒత్తిడి లేని పోస్టులో నియమించాలని సాంబశివరావు కోరడంతో, ఆయనను అక్కడి నుంచి మార్చారు. పాలనా వ్యవహారాల్లో ఐటీ, సాంకేతిక పరిజ్ఞానాల్ని సమర్థంగా వినియోగించుకుంటారని బాబుకి పేరుంది.
కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉండగా ఆయన అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. భూసార పరీక్షలు నిర్వహించి, వాటి ఆధారంగా రైతులు అవసరమైన మేరకే ఎరువులు వాడటం, చౌకధరల దుకాణాల్లో ఇ-పోస్ యంత్రాల వాడకం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయకు గుర్తింపు తెచ్చాయి. ఐటీ, సాంకేతిక పరిజ్ఞానాలపై ఆయనకున్న ఆసక్తి దృష్ట్యా ఏపీ ఫైబర్నెట్ లిమెటెడ్కి ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయనను రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సీఈవో, ఐపీఐఐసీ వీసీ అండ్ ఎండీ పోస్టులకు ఇన్ఛార్జిగాను అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీగా ఉన్న జె.నివాస్ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీ చేశారు. ఇటీవలే కొన్ని జిల్లాల కలెక్టర్లు సహా, కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం, సోమవారం మరో కొందరిని బదిలీ చేసింది. త్వరలో మరి కొందరి బదిలీలు ఉంటాయని సమాచారం.