ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా కె.నాగబాబు నామినేషన్ శుక్రవారం దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితా రాణికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు బలపరిచారు. ఆ తర్వాత నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాస రావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, తన నామినేషన్ను బలపరిచిన మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్లకు ధన్యవాదాలు అని తెలిపారు.
నాడు ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇపుడు కండిషన్స్ అప్లై అని చెప్పడం ఏమిటని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా అమలవుతుందని, అయితే, ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులంటూ ప్రభుత్వం నిబంధన పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీనిపై భారతి స్పందిస్తూ, ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నారని ఇపుడు షరతులు వర్తిస్తాయని అనడం దారుణమని విమర్శించారు.
ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యం కేవలం జిల్లా స్థాయి వరకే పరిమితమని చెప్పడం మోసపూరిత చర్యే అవుతుందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, అందుకే ఇలాంటి కుంటి సాకులు చెబుతుందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాన చేస్తున్నారని మండిపడ్డారు.
పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టిన ఈ ప్రభుత్వం.. రేపు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేసరికి నియోజకవర్గం, మండల పరిధి వరకే ఉచిత ప్రయాణం అంటుందేమో అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతుందని ఆమె గుర్తు చేశారు.
ఇది ఒక మంచి పథకమన్నారు. ఇలాంటి పథకాన్ని అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదన్నారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా అని ప్రశ్నించారు. తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండాలని మహిళల తరపున కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.