అచ్చెన్నాయుడుపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు: శాసనసభా హక్కుల కమిటీ స‌మీక్షలో తీర్మానం

మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:46 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభా హక్కుల కమిటీ, వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలోని కమ్యూనిటీ హాలులో చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెలగపల్లి వరప్రసాదరావు, సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, అసెంబ్లీ కార్యదర్శితో పాటు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు కమిటీ ముందు హాజరు కావాల్సి ఉన్నా, తాను రాలేకపోతున్నానని, ముందస్తు అనుమతి కోరడంతో, సమావేశంలో నిర్ణయించి, సెప్టెంబర్ 14 వ తేదీ ఉదయం 11గంటలకు కమిటీ ముందు హాజరు కావలసిందిగా నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఇచ్చిన వివరణ అసంపూర్తిగా ఉన్నందున పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కోరుతూ, 10 రోజుల గడువు విధించి, ఆ పైన తదుపరి చర్యలు తీసుకునే విధంగా కమిటీ నిర్ణయించింది.

పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందున, మరొక అవకాశం ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాత, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కమిటీ అంగీకారానికి వచ్చారు.

మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం ప్రభుత్వంలో విప్‌గా పనిచేసిన కోన రవికుమార్, స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, వ్యక్తిగతంగా హాజరై, 31వ తేదీ 12 గంటలకు కమిటీ ముందు హాజరు కావాల్సి  ఉన్నా, గైర్హాజరు కావడాన్ని కమిటీ ధిక్కారం కింద భావించి, ఆయనపై తగిన చ‌ర్యల నిమిత్తం నివేదికను తయారుచేసి, అసెంబ్లీ ముందు ఉంచేందుకు తీర్మానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు