గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి చ‌ర్య‌లు: మంత్రి పెద్దిరెడ్డి

గురువారం, 20 ఆగస్టు 2020 (08:36 IST)
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి  సెప్టెంబర్ 20వ తేదీ నుంచి నిర్వహించే పరీక్షల ప్రక్రియ పకడ్భందీగా జరిగేలా జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటిసారి సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలు అత్యంత పారదర్శకంగా జరిగాయని అన్నారు.

అదే విధంగా రెండో విడత నిర్వహిస్తున్న పరీక్షలు సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. గతానికి, ప్రస్తుతానికి మద్య తేడా వుందని, కోవిడ్ కారణంగా అభ్యర్ధుల ఆరోగ్య భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాల్సి వుందని అన్నారు. పరీక్షలు రాసే అభ్యర్ధుల మధ్య భౌతికదూరం తప్పనిసరిగా వుండాలని అన్నారు.

ఈసారి మొత్తం 16,208 ఖాళీలకు గానూ 10,63,168 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారని, వారికి మొత్తం వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ వుంటుందని తెలిపారు. సుమారు 5082 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్లు పరీక్షల కోసం జిల్లా జాయింట్ కలెక్టర్లను, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. అలాగే పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
 
కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలకు హాజరైన అభ్యర్ధుల్లో కోవిడ్ పాజిటీవ్, కోవిడ్ అనుమానిత లక్షణాలు వున్నట్లయితే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అలాగే పరీక్షల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు వున్నట్లు గుర్తిస్తే వెంటనే వారి స్థానంలో వేరే వారికి బాధ్యతలు అప్పగించేలా ముందుగానే ప్రణాళికను సిద్దం చేసుకోవాలని సూచించారు. 

సిబ్బందితో పాటు పరీక్షలకు హాజర్యే అభ్యర్ధులకు కూడా కోవిడ్ జాగ్రత్తలపై ముందుగానే అవగాహన కల్పించాలని అన్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలకు అందుబాటులో అత్యవసర మెడికల్ బృందాలను సిద్దం చేసుకోవాలని కోరారు. అన్ని పరీక్షా కేంద్రాలను ముందుగానే డిసిన్ఫెక్షన్ స్పేతో శుభ్రం చేయాలని అన్నారు. ప్రతి అభ్యర్ధి ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్లను, ధర్మల్ స్కానింగ్‌ను కూడా అందుబాటులో వుంచాలని అన్నారు. 
 
పరీక్షా కేంద్రాల కోసం క్లస్టర్‌లను గుర్తించాలి...
ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు క్లస్టర్‌లను గురించి, వాటిలోనే మొత్తం పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికను సిద్దం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైన అర్బన్‌ ప్రాంతాల్లో ఈ పరీక్షా కేంద్రాలు వుండేలా చూసుకోవాలని సూచించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్లు ఆయా పరీక్షా కేంద్రాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దివ్యాంగులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే పరీక్ష రాసేలా జాగ్రత్త తీసుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించడం, పరీక్ష అనంతరం స్కానింగ్ కేంద్రాలకు జవాబు పత్రాలను సకాలంలో తరలించడంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గతంలో నిర్వహించిన మాదిరిగానే ఈసారి కూడా పరీక్షా కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ కొనసాగించాలని సూచించారు. అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేందుకు అవసరమైన రవాణా సదుపాయం కూడా వుండేలా జిల్లా కలెక్టర్లు జాగ్రత్త తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆర్టీసి సైతం పూర్తిస్థాయి సర్వీసులు నిర్వహించలేకపోతోందని, దీనిని పరిగణలోకి తీసుకుని స్థానికంగా వున్న ఆర్టీసి రీజనల్ మేనేజర్లతో సంప్రదించి రవాణా సదుపాయం వుండేలా జాగ్రత్త తీసుకోవాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు