మంద బయలు భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు

మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:38 IST)
అమరావతి హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. పశువులను మేతకు ఉద్దేశించిన మంద బయలు  భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సామాజిక ప్రయోజనం కోసం రెవెన్యూ రికార్డుల్లో వర్గీకరించిన ఈ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. ప్రభుత్వ రికార్డుల్లో పశువులను మేపుకునేందుకు ఉద్దేశించిన 'మందబయలు' భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
ఆ భూమిలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వెల్నెస్ కేంద్రాల నిర్మాణాలు సరికాదని తేల్చి చెప్పింది. సామాజిక ప్రయోజనం కోసం రెవెన్యూ రికార్డుల్లో వర్గీకరించిన మందబయలు భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. మందబయలుగా పేర్కొన్న భూమిని బోర్డ్ స్టాండింగ్ ఉత్తర్వులకు అనుగుణంగా 'అసెస్డ్ వేస్ట్ డ్రై'గా రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయకుండా ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించడానికి వీల్లేదని చెప్పింది. 
 
బీఎస్వో ప్రకారం మందబయలు భూమి స్వభావాన్ని మార్చినప్పటికీ ఆ స్థలాన్ని పంచాయతీకి బదలాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. నోటిఫికేషన్ ఇవ్వనంత వరకు ఆ భూమిపై పంచాయతీకి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లె గ్రామంలో సర్వేనంబరు 74 / 3లో మందబయలుగా పేర్కొన్న భూమిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్రం ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులను ఆదేశించింది. 
 
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు. డీకేటీ పట్టాల ద్వారా తమకు కేటాయించిన 24 సెంట్ల భూమిలో ముత్యాలపల్లె పంచాయతీ అధికారులు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారంటూ ఆ గ్రామానికి చెందిన కొల్లాటి ఏడు కొండలు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి స్వభావాన్ని మార్చారన్నారు. తమను ఖాళీ చేయించడానికి చూస్తున్నారన్నారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయమూర్తి అధికారులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం సర్వేనంబరు 74 / 3లో భూమి మందబయలుగా పేర్కొన్నారని తెలిపారు. పిటిషనర్లు ఫోర్జరీ సంతకాలతో పట్టాలు సృష్టించారని అధికారులు చెబుతున్నపటికీ ఆ ఆరోపణలకు ఆధారాలు చూపలేదన్నారు. సర్వేనంబరు 74 / లోని 24 సెంట్ల భూమి పిటిషనర్ల స్వాధీనంలో ఉందన్నారు. పిటిషనర్ల స్థలం విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారుల్ని ఆదేశించారు. 
అయితే పిటిషనర్లకు ఇచ్చిన డీఫాం పట్టాలు ఆవాస్తవమైనవని తేలితే, ఆ స్థలం నుంచి వారిని తహసీల్దార్ చట్ట ప్రకారం ఖాళీ చేయించడానికి ఈ తీర్పు అడ్డంకి కాదని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు