అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

ఠాగూర్

ఆదివారం, 6 ఏప్రియల్ 2025 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం - నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం లైన్ క్లియర్ అయింది. ఈ రైల్వే లైను నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇందుకోసం చేపట్టిన భూసేకరణ కొంతమేరకు కొలిక్కివచ్చింది. ఈ నేపథ్యంలో రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. తొలుత 27 కిలోమీటర్ల ట్రాక్‌తో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మరో రెండు నెలల్లో టెండర్లు ఆహ్వానించనున్నారు. 
 
కాజీపేట - విజయవాడ లైనులోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి మొదలయ్యే ఈ రైల్వే లైను అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ - గుంటూరు లైనులో కలుస్తుంది. ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 57 కిలోమీటర్లు. 27 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి రూ.450 కోట్లు, కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా వేశారు. అయితే, రెండేళ్లలోనే పూర్తి చేయాలని రైల్వే శాఖను సీఎం చంద్రబాబు కోరారు. 
 
ట్రాక్ నిర్మాణం రెండేళ్ళలో పూర్తవుతుందని, కానీ, వంతెన నిర్మాణానికి మూడేళ్లు పడుతుందని రైల్వే శాఖ చెబుతోంది. అలాగే, అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలుస్తారు. సీఆర్‌డీఏ పరిధిలోని తాడికొండ ప్రాంతంలో రైల్వే లైనుకు భూమిల్చేందుకు రైతులు అభ్యంతరం చెబుతుండటంతో అమరావతి నుంచి నంబూరు వరకు 26.5 కిలోమీటర్ల రైల్వే లైను పనులు మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు