అమరావతి రైతుల రిలే దీక్షపై వైకాపా శ్రేణుల దాడి

శనివారం, 25 జనవరి 2020 (14:17 IST)
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు రిలే దీక్ష శిబిరంపై అధికార వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అంతేకాకుండా, రిలే నిరాహారదీక్షకు కూడా నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
అలాగే, రిలే దీక్షలో కూర్చొన్న వారిపై కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు బైక్‌లతో చక్కర్లు కొడుతున్నారు. శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు.
 
శిబిరం ఎదుట మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేసి రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో... ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తోపులాటకు దారి తీయడంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకూ నచ్చజెప్పి శాంతించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు