ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే - తేల్చి చెప్పిన చంద్రబాబు!!

వరుణ్

మంగళవారం, 11 జూన్ 2024 (17:37 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతేనని ఆంధ్రప్రదేశ్ రాష్టచ్రానికి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. ఇకపై మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలాడే పరిస్థితి ఉండదని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వం అమరావతి, కర్నూలు, విశాఖపట్టణంలలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావించిన విషయం తెల్సిందే. ఈ మూడు రాజధానుల ఆటకు చంద్రబాబు తెరదించారు. 
 
ఈ మేరకు మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ఆయన ధన్యవాదాలు చెబుతూ ప్రజా తీర్పును గౌరవించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తామందిరిపైనా ఉందన్నారు. ఇపుడు సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. 
 
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని వివరించారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించినపుడే పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెప్పారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికీ నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.
 
గత ప్రభుత్వ హయంలో ఐదేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దే పని ప్రారంభిస్తామని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళతామని చెప్పారు. 'సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం కూడా మామూలు మనిషే.. అలాగే మీ ముందుకు వస్తా. మిత్రుడు పవన్ కల్యాణ్‍‌‌తో పాటు మేమంతా సామాన్యులుగానే ప్రజల వద్దకు వస్తాం' అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు