చంద్రబాబు ఏపీ సీఎం కాదు.. టూరిస్ట్ ముఖ్యమంత్రిగా మారారు : అంబటి రాంబాబు

ఆదివారం, 8 మే 2016 (15:56 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా కంటే.. టూరిస్టు ముఖ్యమంత్రిగా బాగానే రాణిస్తున్నారన్నారు. 
 
అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారని మండిపడ్డారు. 
 
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ మంగళవారం నుంచి చేపట్టిన ధర్నా కార్యక్రమాల్లో అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఢిల్లీలో మరోసారి ఉద్యమిస్తామన్నారు. మాకు మద్దతుగా టీడీపీ ఎంపీలను పంపుతారా అని ప్రశ్నించారు. 
 
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పినా.. చంద్రబాబు మాత్రం పోరాడి సాధించుకుంటామని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. అయినా కేంద్రంతో పోరాడే దమ్ము ఆయనకు లేదని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. సీఎం మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందని విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి