చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

ఠాగూర్

బుధవారం, 30 ఏప్రియల్ 2025 (09:55 IST)
చిన్నపాటి అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది. పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆమె ధరించిన చున్నీనే ఆమె ప్రాణాలు తీసింది. భర్తతో కలిసి బైకుపై వెళుతుండగా మెడకు చున్నీ చుట్టుకునిపోయి వివాహిత మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో వెలుగు చూసింది. పెళ్లయిన 9 నెలలకే భార్య మరణించడంతో కుటుంబ సభ్యులు, మృతురాలి తల్లిదండ్రులు, ఆమె భర్త బోరున విలపిస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన రామదుర్గ (28)కు కోనసీమ జిల్లా పోలవరంకు చెందిన మోహనకృష్ణతో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. మోహన కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ సెజ్ సమీపంలో ఇల్లు అద్దె తీసుకుని నివాసం ఉంటున్నారు. రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటం సోమవారం రాత్రి 7 గంటలకు భార్యను తీసుకుని భర్త ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి బయలుదేరారు. 
 
వారి బైకు హరిపాలెం ప్రాంతంలో వెళుతుండగా రామదుర్గ వేసుకున్న చున్నీ బైకు వెనుకచక్రంలో పడి ఆమె మెడకు బిగుసుకునిపోయింది. అటుగా వెళుతున్న వారు గమనించి అప్రమత్తం చేసేలోపు ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికుల సాయంతో భర్త వెంటనే చున్నీని కత్తిరించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇలా పెళ్లయిన 9 నెలలకే కన్నుమూయడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు