ఆనందయ్య మందు తయారీకి సమయం నెల రోజులే... ఆ తర్వాత?

సోమవారం, 31 మే 2021 (08:40 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు బొణిగి ఆనందయ్య మందు తయారీకి అనుమతిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అనుమతిస్తుందా..? అని కోట్లాది మంది ప్రజలు మందుకోసం వేచి చూస్తున్నారు. ఈ నెల 21న ఆగిపోయిన మందు పంపిణీపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. 
 
మరోవైపు.. ఆనందయ్య మందు తయారీకి ఔషద మొక్కల కొరత ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏడాదిలో మూడు నెలలే బతికుండే డామరడంగి, నేల ఉసిరి, పిప్పంటాకు జాతి మొక్కలు మందు తయారీలో వాడుతున్నారు. మందు తయారీకి మరో నెలరోజులు మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అయోమయం నెలకొంది.
 
ఇప్పటికే కోట్లాది మంది ఈ మందు కోసం ఎదురుచూస్తున్నారు. ఆనందయ్య తయారు చేసిన మందుపై ఆయుష్‌ శాఖ ఇంకా తుది నివేదిక ఇవ్వలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆయుష్‌ నివేదిక అందాక కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. 
 
మందుకు రెండు రోజుల్లో ప్రభుత్వ అనుమతి వచ్చే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి చెబుతున్నారు. ఆనందయ్య మందుపై వివాదాలు సృష్టించేందుకు కొంతమంది పనికట్టుకొని రాజకీయ రగడ సృష్టిండానికి ప్రయత్నం చేస్తున్నారని, అయినా సంయమనం పాటిస్తున్నామన్నారు. ఈ మందు పంపిణీపై ఎప్పుడు సస్పెన్స్ వీడుతుందో ఏంటో మరి. ప్రభుత్వం కూడా మందుకు అనుమతి ఇచ్చే విషయంపై మీనమేషాలు లెక్కిస్తుందనే ఆరోపణలు లేకపోలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు