15న వాహన మిత్ర కింద ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు డబ్బు జమ

సోమవారం, 14 జూన్ 2021 (18:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోనున్నారు. ఇందులోభాగంగా, మంగళవారం మరో దఫాగా రూ.10 వేల ఆర్థికసాయాన్ని పంపిణీ చేయనున్నారు. 
 
వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద ఈ యేడాది 2,48,468 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. వారిలో 2,07,974 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం విశేషం. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ ఉన్న అర్హులైన డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు, బీమా తదితర ఖర్చుల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
 
వరుసగా మూడో ఏడాది ఈ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.248.46 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ చేయనున్నారు. గత ఏడాది 2,24,777 మంది లబ్ధిదారుల్లో ఈ ఏడాది 2,05,536 మంది అర్హులుగా తేలారు. వాహనాలను విక్రయించడం, ఇతరత్రా కారణాలతో 19,241మంది అనర్హులయ్యారు. 
 
వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కోసం ఈ ఏడాది కొత్తగా 46,237 మంది దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో 42,932 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం మీద పాత, కొత్త రిజిస్ట్రేషన్లు కలిపి 2,71,014 మంది దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో 2,48,468 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం లబ్ధిదారుల్లో 83 శాతం మంది.. అంటే 2,48,468 మందిలో 2,07,974 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారే ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు