నూతన విద్యా విధానం అమలులో ఏపి నెంబర్ వన్

బుధవారం, 29 డిశెంబరు 2021 (16:10 IST)
దేశ వ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్పిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ నాయకత్వంలో విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో “జాతీయ విద్యా విధానం – అమలు, ప్రధానోపాధ్యాయుల పాత్ర” అనే అంశంపై చర్చా వేదికను నిర్వహించారు. 
 
 
ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు, ఎమ్మెల్సీలు హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి సిఎం జగన్ ప్రత్యేక శ్రద్ద వహించారని చెప్పారు. టీచర్స్ నైపుణ్యాలను పెంపొందించేందుకు దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చట్టం చేసి, ఆంధ్రకేసరి యూనివర్సిటీని తీసుకువచ్చిందని తెలిపారు. ఉపాధ్యాయ కోర్సులు, శాశ్వత శిక్షణ కార్యక్రమాలు వర్సిటీ నిర్వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన “నాడు – నేడు” కార్యక్రమానికి ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. 
 
 
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆశయ సాధనకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు కష్టపడి నాడు-నేడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను పటిష్టపరచే విధంగా డి.ఈ.ఓ, ఎం.ఈ.ఓ పోస్టులను భర్తి చేస్తామని, విద్య రంగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికల‌ను  రూపొందిస్తున్నామని తెలిపారు. వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు మాట్లాడుతూ, నాణ్యమైన విద్యను అందించడంలో గురువుల పాత్ర కీలకమని, జాతీయ విద్యా విధానం అమలుకు గురువులంతా కృషి చేయాలని అన్నారు. భారతదేశానికి చెందిన మేథావుల మేథస్సును దేశం కొరకు ఉపయోగించాలని కోరారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, సమాజంలో గురువులకు ఎంతో గౌరవం ఉందని, గురు స్థానాన్ని కాపాడుకుంటూ, గురువులకు ఉన్న గౌరవాన్ని మరింత పెంచే విధంగా పని చేయాలని అన్నారు.   త‌రువాత రాష్ట్ర హెచ్.ఎమ్స్ సంఘ డైరీ, క్యాంలెండర్ లను ఆవిష్కరించారు. అనంతరం అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేసారు. 
 
 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ, ఇళ్ళ వెంకటేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ప్రధానోపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యాక్షులు జి.వి.నారాయణరెడ్డి, జిల్లా అధ్యాక్షుడు చేవూరి రవి, రాష్ట్ర సహా కార్యదర్శి కోళా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శ ఎం.కూర్మరావు, కోశాధికారి పి.వి.వి.సత్యనారాయణ, డివిజన్ అధ్యాక్షులు కె.వి.రమణరావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు