స్వాబ్ టెస్టులను నిలిపివేసిన ఏపీ సర్కారు.. ఇక నేరుగా ఇంటికే...

బుధవారం, 12 ఆగస్టు 2020 (23:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ఈ కరోనా మరణాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయ. బుధవారం కూడా 93 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క గుంటూరులోనే అత్యధికంగా 13 మంది చనిపోయారు. 
 
అలాగే, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. ఇతర జిల్లాల్లోనూ కరోనాతో మరణాలు నమోదవుతుండటంపట్ల ఆందోళన నెలకొంది.
 
ఇకపోతే, కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,296కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 9,597 పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,146 కాగా, ఇంకా 90,425 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా, 6,676 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 1,61,425 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది.
 
అయినప్పటికీ ఏపీ సర్కారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు కరోనా టెస్టులు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇకపై కరోనా పరీక్షలు చేయడం జరగదని అధికారులు తేల్చి చెప్పారు. 
 
ప్రభుత్వ సడలింపుల దృష్ట్యా ప్రయాణికులను స్వాబ్ టెస్టుకు పంపడం లేదని తెలిపారు. ప్రయాణికులు నేరుగా స్వస్థలాలకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు.
 
ఇప్పటివరకు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, చెక్‌పోస్టుల వద్ద స్వాబ్ టెస్టుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన ప్రతి ప్రయాణికుడికి ఇప్పటివరకూ కరోనా పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఇకపై కరోనా పరీక్షలు నిర్వహించరు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు