'సైజల్' అంటే గోంగూరనా? ప్రశ్నించిన రాష్ట్ర అధికారి!!

బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (09:23 IST)
బెంగుళూరులో జరుగుతున్న బెంగుళూరు ఇండస్ట్రీస్ మీట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి వింత అనుభవం ఎదురైంది. ఈ సదస్సుకు హాజరైన ప్రతినిధుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూట్ (జనపనార), సైజల్ ( కలబంద తరహా మొక్క నుంచి తీసే నార) పరిశ్రమల గురించి ప్రశ్నించారు. దీనికి ఏపీ మంత్రులతో పాటు అధికారులు కూడా సమాధానం చెప్పలేక నీళ్లునమిలారు.
 
పైగా, సమాధానం చెప్పలేక.. ఈ రంగలో మా రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. 'జూట్' అంటే జనపనార.. 'సైజల్' అంటే గోంగూరనా? అని ఆ ప్రతినిధిని రాష్ట్ర అధికారి ప్రశ్నించారు. చివరకు కలబంద తరహా మొక్క అని ఆ ప్రతినిధే రాష్ట్రాధికారికి తెలియజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
త్రీ క్యాపిటల్స్ మిస్ కమ్యూనికేషన్ : మంత్రి బుగ్గన 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానుల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అసలు మూడు రాజధానులు అనే మాట ఒట్టి ముచ్చటే.. కర్నూలు న్యాయ రాజధాని కాదు. అమరావతి శాసన రాజధానిగా ఉండదు. అసలు మూడు రాజధానులు అనేదే తప్పుగా వెళ్లిన సందేశం... మిస్ కమ్యూనికేషన్ అని సాక్షాత్ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తేల్చి చెప్పేశారు. 
 
మంగళవారం బెంగుళూరులో జరిగిన బెంగుళూరు ఇండస్ట్రీ మీట్‌లో ఆయన ఏపీ పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బుగ్గన సమాధానమిస్తూ, ఏపీలో మూడు రాజధానులు అనేవి లేవన్నారు. మూడు రాజధానులనేది ఒక మిస్ కమ్యూనికేషన్. పరిపాలన రాజధాని విశాఖపట్టణం నుంచే జరుగుతుంది. 
 
ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలదృష్ట్యా చూస్తే రాజధానిగా అదే ఉత్తమం. తదుపరి అభివృద్ధికీ అవకాశం ఉంటుంది. ఓడరేవు ఉంది. కాస్మోపాలిటన్ కల్చర్. వాతావరణం.. ఇలా అన్ని రకాలుగా విశాఖ అనుకూలం. ఇక కర్నూలు రెండో రాజధాని కాదు. అక్కడ హైకోర్టు ఉంటుందంటే. కర్నాటకకు ధర్వాడ, గుల్బర్గాలో హైకోర్టు ధర్మాసనాలు ఉన్నాయి. అలాగే, కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉండాలని భావించాం. తిరుపతి ఆధ్యాత్మికంగా ప్రపంచానికే రాజధాని అని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు