సీఎం జగన్ పాలనలో కరోనా వైరస్ విలయతాండవం??

సోమవారం, 31 ఆగస్టు 2020 (10:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వ పాలన సాగుతోంది. ఈ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. ఇందుకు నిదర్శనమే కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగలడమే. అదేసమయంలో ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలివేసిందన్న ఆరోపణలు లేకపోలేదు. 
 
ముఖ్యంగా, ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతుంటే.. ఏపీలో మాత్రం ఖజానాను నింపుకునేందుకు మద్యం షాపులను తెరిచి కరోనా వైరస్ వ్యాప్తికి ప్రత్యక్షంగా కారణమైందనే విమర్శలు లేకపోలేదు. ఈ కారణంగానే ఇపుడు ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రస్తుతం ఏపీలో రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంతవరకూ దేశంలో అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో వుండగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు రెండో స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించేసింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 4.24 లక్షలకు పైగానే కేసులున్నాయి. గడచిన ఐదు రోజులుగా ఏపీలో నిత్యమూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం గమనార్హం.
 
ప్రస్తుతం తమిళనాడులో 4.16 లక్షలకు పైగా కేసులుండగా, ఏపీ దాన్ని అధిగమించింది. అయితే, టెస్టుల విషయంలో మాత్రం ఏపీ మిగతా రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంది. ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 68,660 మందికి ఇప్పటికే కరోనా పరీక్షలు జరిగాయి. 
 
తాజా గణాంకాల ప్రకారం, ఏపీలో 9,067 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 88 మంది మరణించారు. ఇప్పటివరకూ 3.21 లక్షల మందికి పైగా వ్యాధి బారి నుంచి కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
 
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల నుంచి వెయ్యేసికి పైగానే కేసులు వస్తున్నాయి. ఆపై పశ్చిమ గోదావరి, కడప, చిత్తూరు జిల్లాల నుంచి 900కి పైగా కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠిన నిబంధనలను అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు