ప్రత్యేక హోదాతో ప్రయోజనం శూన్యం.. పారిశ్రామిక రాయితీలు ఉండవు : చంద్రబాబు

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (12:28 IST)
విభజన చట్టం మేరకు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పారిశ్రామిక రాయితీలు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాలో పారిశ్రామిక రాయితీలు ఉండవని, హోదాతో వచ్చే ప్రయోజనాలు అన్నీ ప్యాకేజీలో ఉన్నాయన్నారు. 
 
ఆయన శుక్రవారం జిల్లాలోని కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేసిన గమేశా గాలిమరల రెక్కల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇఫ్కో సెజ్‌లో గమేసా కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు. 
 
ఈ రెండు రోజుల్లోనే రూ.1800 కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీలు పనులు ప్రారంభించాయని గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీరుతో అమెరికా వెళ్లిన భారతీయులు ఇబ్బంది పడుతున్నారని, భవిష్యత్తులో మనమే ఉద్యోగాలు సృష్టించుకోవాలని చంద్రబాబు అన్నారు.
 
విద్యుత్, భూములు, నీటి వసతి కల్పించడం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి