సాగు చట్టాల రద్దు - ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్!

బుధవారం, 24 మార్చి 2021 (06:41 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు వివాదాస్పద జాతీయ వ్యవసాయ చట్టాల రద్దు, దేశంలోని పలు పబ్లిక్ రంగ సంస్థలతో పాటు.. విశాఖ ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా ఈ నెల 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినిచ్చింది. 
 
ఈ బంద్‌కు టీడీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణ శాఖ మంత్రి పేర్ని నాని భారత్ బంద్‌పై ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. ఈ నెల 26న చేపట్టబోయే భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. ఆ రోజున మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులు నిలిపివేస్తామని చెప్పారు. బంద్‌లో శాంతియుతంగా నిరసన తెలపాలని మంత్రి కోరారు. 
 
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ బంద్‌కు మద్దతిచ్చిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఏపీ శాఖ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కర్షక, కార్మిక, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఏనాడూ వెనుకంజ వేయదని, అందువల్ల ఈ పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసేందుకు పోస్కోతో ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంటు సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్, కార్మికుల జీవితాలపై వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామాలు చేసి పోరాటానికి రావాలని డిమాండ్ చేశారు. 
 
చీకటి ఎజెండాతో కార్మికులను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లను బిగించే నిర్ణయాన్ని జగన్ రెడ్డి వెనక్కు తీసుకోవాలన్నారు. నయవంచనకు, నమ్మక ద్రోహానికి మారుపేరుగా వైసీపీ ఉందని విమర్శించారు. దేశానికి గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా అంటూ అచ్చెన్నాయుడు నిలదీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు