ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 160కు పైగా సీట్లు గెలుచుకుంటాం : చంద్రబాబు

ఠాగూర్

మంగళవారం, 19 మార్చి 2024 (14:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల కూటమి 160కి పైగా సీట్లను గెలుచుకుంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు ప్రధానమంత్రి బాధ్యతలు చేపడుతారన్నారు. అలాగే, ఏపీలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఇది నవశకానికి ఆవిర్భావమన్నారు. గత ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్మిస్తామన్నారు. 
 
కాగా, వచ్చే ఎన్నికల్లో అధికార వైకాపాకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే ఇప్పటి నుంచే ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, ఈ కారణంగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, హింసా రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మునయ్య, నంద్యాలలో ఇమామ్‌లను వైకాపా గూండాలు హత్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముగ్గురు ఎస్పీల అండతోనే వైకాపా గూండాలు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఆ ఎస్పీలు పరమేశ్వర రెడ్డి, రఘువీర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిలు వైకాపా అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదానికి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. 
 
కాగా, ఏపీ అసెంబ్లీలోని 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే, జనసేన పార్టీ 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తుంది. టీడీపీ స్థానాల్లో ఇప్పటివరకు 128 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం సాయంత్రానికి మరికొందరి పేర్లు వెల్లడించే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు