ఆహా ఏమి వింత!! ఓటర్ల జాబితాలో తప్పులు తడకలు.. పేరు మహిళది.. ఫోటో సీఎం జగన్‌ రెడ్డిది..

మంగళవారం, 7 నవంబరు 2023 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు తయారు చేసిన ఓటర్ల జాబితా పూర్తిగా తప్పులు తడకలుగా ఉందని విపక్ష పార్టీల నేతలు గత కొన్ని రోజులుగా ఆరోపణలు గుపిస్తున్నారు. వీటిని అధికార వైకాపా నేతలు కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయితే, విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించే ఆధారం ఒకటి వెలుగు చూసింది. ఓటర్ల జాబితాలో మహిళ పేరు ఉన్న చోట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించారు. ప్రకాశం జిల్లా చెర్లోపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా భావించవచ్చు. మహిళ పేరు వద్ద ఉన్నది జగన్ ఫోటో అని స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని ఓటర్ల జాబితాను రూపొందించారు. ఇది అధికారుల నిర్లక్ష్యాన్ని తార్కారణంగా చెప్పుకోవచ్చు. 
 
వచ్చే యేడాది ఆరంభంలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సివుంది. దీంతో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓటర్ల ముసాయిదా జాబితాను తాజాగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాళెం నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామ ఓటర్ల జాబితాలో ముఖ్యమంత్రి జగన్ ఫోటో దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన గురవమ్మ అనే మహిళ ఫోటో ఉండాల్సిన చోట సీఎం ఫోటోను అప్‌లోడ్ చేశారు. 
 
బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు ముద్రణకు ఇచ్చే ముందు బీఎల్వోతో పాటు రెవెన్యూ అధికారులు కూడా తనిఖీ చేస్తారు. ఇక్కడ అలాంటిదేమీ జరిగినట్టు కనిపించడం లేదు. అందుకే క్షమించరాని విధంగా ఈ పొరపాటు జరిగిందని, ఇది అధికారులు నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు