జల వివాదం ముదురుతోంది... జోక్యం చేసుకోండి : ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

శుక్రవారం, 2 జులై 2021 (10:22 IST)
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం నీటిని విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా తెలంగాణ తోడేస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు సృష్టిస్తోందని.. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. 
 
పైగా, తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల భద్రతకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలూ కేటాయింపుల మేరకు  కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు వీలుగా విభజన చట్టం సెక్షన్‌ 85 ప్రకారం ఏర్పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేయాలని అభ్యర్థించారు. 
 
జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా తెలంగాణ నీటిని తోడేయడం.. పోలీసులను మోహరించి మరీ జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తుండడంతో రెండు రాష్ట్రాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. సీఎం జగన్‌ ప్రధానికి గురువారం నాడు ఐదు పేజీల లేఖ రాశారు. 
 
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు కూడా విడిగా ఈ అంశంపై లేఖ రాశారు. శ్రీశైలం జలాశయాన్ని విద్యుతుత్పత్తి కోసమే నిర్మించినా.. తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అది సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతూ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారిందని ప్రధానికి సీఎం వివరించారు.
 
తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలే తీరుస్తున్నాయని.. సాగర్‌, జూరాల ప్రాజెక్టులను తెలంగాణ పర్యవేక్షిస్తుంటే.. శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ఆంధ్రప్రదేశ్‌ నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) సమయానుకూలంగా నీటి కేటాయింపులు., వినియోగాన్ని పర్యవేక్షించాల్సి ఉన్నా.. ఆ బాధ్యతల కేటాయింపు ఇంకా పూర్తికాలేదని ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం జగన్ గుర్తుచేశారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు