ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్... వైకాపా ప్రతిపక్ష హోదా దక్కేనా?

వరుణ్

మంగళవారం, 4 జూన్ 2024 (14:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార వైకాపా ఘోర పరాజయాన్ని చవిచూడనుంది. మొత్తం 175 సీట్లలో పోటీ చేసిన వైకాపా.. ఇపుడు కేవలం 15 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. పూర్తి ఫలితాలు వెలువడే సమయానికి ఈ స్థానాలు కూడా మరింతగా తగ్గే అవకాశం ఉంది. పైగా, ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 18 సీట్లు రావాల్సివుంది. కానీ, టీడీపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ 20 స్థానాల్లో జనసేన గెలిస్తే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోనుంది. 
 
నిజానికి గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగించిన అరాచక పాలనకు వైకాపా భారీ మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఘోర పరాభవం దిశగా సాగుతుంది. జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఘన విజయం దిశగా తీర్పు ఇచ్చారు. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైకాపా కనీస స్థాయిలో కూడా కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. 'వార్‌ వన్‌ సైడ్‌' అన్నట్లుగా రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానాల్లో కూటమి దుమ్ములేపింది. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ వైకాపా చతికిలపడింది. ప్రజాతీర్పు స్పష్టం కావడంతో పలుచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లెక్కింపు కేంద్రాల నుంచి ఇంటిముఖం పడుతున్నారు. 
 
ఫలితాల సరళి చూసిన తర్వాత వైకాపాకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాలి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అంతకంటే తక్కువ స్థానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. వైకాపా కంటే మెరుగ్గా జనసేన సొంతంగానే 20 స్థానాల్లో లీడ్‌లో ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా ఉంటుందా? లేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు