మానవీయ కోణంలో రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలు: గవర్నర్ బిశ్వభూషన్

గురువారం, 7 మే 2020 (22:19 IST)
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ రెడ్‌క్రాస్ సభ్యులు, వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసిఆర్‌సి) వ్యవస్థాపకుడు, మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జీన్ హెన్రీ డునాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 8న ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని, రెడ్ క్రెసెంట్ డే లను జరుపుకోవటం అనవాయితీగా ఉంది.
 
అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ఉద్యమ సూత్రాల వార్షిక వేడుకగా ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం నిర్వహిస్తుండగా, రెడ్ క్రాస్ సంస్ధ ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్ధగా ఖ్యాతిని గడించింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతి సంవత్సరం మానవతా ఇతివృత్తంతోనే ఈ శుభదినాన్ని జరుపుకుంటుంది. భారతదేశానికి ప్రపంచ రెడ్ క్రాస్ డే 2020 ప్రత్యేకమైనది, ఎందుకంటే 1920లో స్థాపించబడిన భారత రెడ్ క్రాస్ సొసైటీ యొక్క శతాబ్ది సంవత్సరాన్ని ఇది సూచిస్తుంది.
 
ప్రపంచాన్ని కరోనా మహమ్మరి బాధిస్తున్న తరుణంలో ఈ సంవత్సరం “వాలంటీర్ల కోసం చప్పట్లు” థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనాపై పోరులో మొదటి వరుస యోధులుగా ఉన్న లక్షలాది మంది రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తుతించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఒక శక్తివంతమైన సంస్థగా ప్రజలకే సేవలు అందిస్తుందని, ఇది ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటానికి కట్టుబడి ఉందని మాననీయ గవర్నర్ అన్నారు. 
 
ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం కృషి, విశాఖపట్నంలో తాజాగా జరిగిన గ్యాస్ లీకేజ్ సంఘటనతో బాధపడుతున్న ప్రజల సహాయక చర్యలు ఇలా, వాలంటీర్లు పోషించిన పాత్రను ఎంచదగినదని గవర్నర్ ప్రశంసించారు. సహాయం అవసరమైన ప్రజలకు రెడ్ క్రాస్ ఎపి స్టేట్ బ్రాంచ్ నిరంతరం అందుబాటులో ఉందన్నారు.
 
సంస్థ కోసం వాలంటీర్లుగా పనిచేయడానికి ఇష్టపడే వారిని చేర్చుకునేందుకు ‘టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1234’ తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని, ఎపి రెడ్ క్రాస్ రాష్ట్రవ్యాప్తంగా 21 కమ్యూనిటీ కిచెన్‌లను నిర్వహించి 6.2 లక్షలకు పైగా ఫుడ్ ప్యాకెట్లు, 215 టన్నుల బియ్యం, కూరగాయలు, డ్రై రేషన్, 89,000 జతల చేతి తొడుగులు, 2.6 లక్షల ఫేస్ మాస్క్‌లను పేద, నిరాశ్రయులు, బలహీన వర్గాలకు పంపిణీ చేసిందని బిశ్వ భూషన్ వివరించారు.
 
వివిధ ప్రభుత్వ విభాగాలు, ఇతర ఎన్జిఓల సహకారంతో రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలను అందించడం ద్వారా కోవిడ్ -19 ఐసోలేషన్ సెంటర్లలో పెద్ద ఎత్తున సహాయకులుగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఉద్యమానికి బలోపేతం చేయటంలో సంస్ధ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఎకె ఫరీడా బృందం మంచి పనితీరును చూపుతుందని గవర్నర్ ప్రశంసించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు