బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి బాంబే హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో శిల్పాశెట్టి దంపతులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ బాంబే హైకోర్టులో సాగుతోంది. శిల్పాశెట్టి దంపతులు దేశం విడిచి వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించిన తర్వాతే ఈ కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను రూ.60 కోట్ల మేరకు శిల్పాశెట్టి దంపతులు మోసం చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. మరోవైపు వీరికి ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం లుకౌట్ నోటీసులు(ఎల్వోసీ) జారీ చేసింది. ఈ క్రమంలో శిల్పాశెట్టి దంపతులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతి కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది.
ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శిల్పాశెట్టి అక్టోబరు 25-29 తేదీల మధ్యలో కొలంబో వెళ్లాల్సి ఉంది. లుకౌట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈవెంట్ నిర్వాహకుల నుంచి ఏమైనా ఆహ్వానం ఉందా? అని కోర్టు శిల్ప లాయర్ను ప్రశ్నించగా, ప్రస్తుతం కేవలం ఫోన్కాల్ ద్వారా మాత్రమే సమాచారం తెలియజేశారని, కోర్టు అనుమతి ఇస్తే, అధికారికంగా ఆహ్వానం అందుతుందని తెలిపారు. అయితే, కోర్టు మాత్రం రూ.60 కోట్లు డిపాజిట్ చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.