ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖైదీల కోసం కోవిడ్ జైళ్లు

బుధవారం, 8 జులై 2020 (06:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో అనేక మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జైళ్ళలో ఉన్న ఖైదీలు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇలాంటి వారిని కరోనా దెబ్బకు విడుదల చేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దీంతో కరోనా అడ్డుకట్ట వేయడంతో పాటు... ఖైదీలకు స్వేచ్ఛ కల్పించకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా జైళ్లను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కాలు నిర్ణయించింది. ఇందుకోసం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్‌, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురంలోని 13 జైళ్లను కరోనా జైళ్లుగా మార్చింది. కొత్త ఖైదీల ద్వారా జైలులో అప్పటికే ఉంటున్న ఇతర ఖైదీలకు వైరస్ సోకకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఇక నుంచి వచ్చే పురుష ఖైదీలను ఈ జైళ్లకు తరలించి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా సోకలేదని తేలితే కోర్టు సూచించిన జైలుకు పంపిస్తారు. పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తారు. ఆయా కోవిడ్ జైళ్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి వైరస్ సోకకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా జైళ్ల శాఖ డీజీని ప్రభుత్వం ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు