'నిమ్మగడ్డ' వ్యవహారాన్ని నేరుగా తేలుస్తాం : ఏపీ హైకోర్టు

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు (ఎస్ఈసీ)ని అడ్డుదారుల్లో తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో బాధితుడు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఉన్నారు. 
 
ఈ అంశంపై గత కొన్ని రోజులుగా వీడియో కాన్ఫరెన్స్‌లో సాగుతోంది. అలాగే, బుధవారం కూడా విచారణ జరిగింది. ఎస్ఈసీ పదవి నుంచి రమేష్ కుమార్‌ను తొలగించడానికి గల కారణాలను కోర్టుకు ప్రభుత్వం వివరించింది. 
 
అలాగే, నిమ్మగడ్డ వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అదీ కూడా కోర్టులోనే నేరుగా విచారణ జరుపనున్న్టుట పేర్కొంది. 
 
హైకోర్టులోనే సామాజిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఇందుకోసం పిటిషన్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని తెలిపింది. పాస్‌లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని పేర్కొంది.
 
మరోవైపు, బుధవారం జరిగిన విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఇతరులు రావడంపై హైకోర్టు చివాట్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎలా వచ్చారని ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎంటర్‌ అయ్యే పాస్‌వర్డ్‌ లీక్‌ చేయడం వల్లే ఇలా జరిగివుంటుందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడి.. ఈ కేసును నేరుగా కోర్టులోనే విచారిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు