త్వరలో కేబినెట్ విస్తరణ. ఉన్న మంత్రులను తొలగించడం, కొత్త మంత్రులను తీసుకోవడం. అది కూడా తన కుమారుడిని మంత్రిని చేయాలని చంద్రబాబు నిర్ణయించేసుకున్నారు. ఇంకేముంది ఆయనకు ఏ శాఖ కేటాయించాలన్నది ప్రస్తుతం టిడిపి సీనియర్ నేతల్లో జరుగుతున్న చర్చ. కానీ బాబు మాత్రం ఒకే పంథాలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణాలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్కు ఐటీ శాఖ అప్పగించినట్లుగా ఐటీ శాఖను ఆయనకు ఇవ్వడానికే సిద్దమైపోయారు. దాంతో పాటు అటవీశాఖ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. దీంతో ఇప్పటికే ఈ శాఖ ఉన్న అనంతపురంకు చెందిన పల్లె రఘునాథ రెడ్డికి ఆ శాఖ మార్పు జరగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది అనుమానమే.
ముందుగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్కు కీలకమైన శాఖను కేటాయించాలనుకుని నిర్ణయించుకున్నారట. అయితే కొత్తగా మంత్రి అవుతున్న నారా లోకేష్కు మొదటగానే పెద్ద పదవి ఇస్తే ఇబ్బంది అవుతుందన్న అనుమానంతో టిడిపి సీనియర్ నేతలు కూడా వద్దని చెప్పుకొచ్చారట. దీంతో ఆయన ఈ రెండు శాఖలను ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒకటి చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల విస్తీర్ణత ఎక్కువగా ఉండడం.
వాటిని కాపాడటంలో అధికారుల నిర్లక్ష్యం, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పెద్దగా పట్టించుకోకపోవడం ఇలాంటి తరుణంలో ఆ శాఖను నారా లోకేష్కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటు ఐటీ.. కీలకమైన శాఖను ఇస్తే పరిశ్రమలుగానీ, ఉద్యోగాలు కానీ ఈ శాఖ కిందకే వస్తుంది కాబట్టి ఆ శాఖను ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఎమ్మెల్సీగా నారా లోకేష్ను ఎన్నుకోవడమే ఆలస్యం.. ఇక మిగిలిందల్లా నారాలోకేష్ మంత్రి కావడమే.