రామతీర్థం ఘటనలో కుట్ర కోణం ఉంది... చేధిస్తాం: మంత్రి అవంతి

మంగళవారం, 5 జనవరి 2021 (20:52 IST)
విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన దురదృష్టకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. రాముని విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్ష ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో కుట్ర కోణం ఉందని... దాన్ని చేధిస్తామని తెలిపారు.
 
ముఖ్యమంత్రి, డీజీపీ మతాలు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం చాలా బాధ కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో ఇతర దేవాలయలపై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు రామతీర్థం ఎందుకు సందర్శించారని ప్రశ్నించారు. 
 
తన సొంత జిల్లాలో ఉన్న తిరుమలకు వెళ్లి చంద్రబాబు ఒక్కసారి అయిన తలనీలాలు ఇచ్చారా అని నిలదీశారు. బీజేపీ, జనసేనకు దేవుళ్ళపై ఎంత భక్తి ఉందో తమకు అంతే భక్తి ఉందని మంత్రి చెప్పారు. బీజేపీ, జనసేన పార్టీలకు రాష్ట్రంపై అభిమానం ఉంటే.. విభజన హామీలను అమలుకు కృషి చేయాలని హితవుపలికారు. 
 
చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దన్నారు. తమ పార్టీపై క్రిస్టియన్ ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో 90 శాతానికి పైగా హిందువులు ఉన్నారని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణిని చంద్రబాబు మానుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు