ఏయ్.. రావే.. నేను పిలుస్తున్నా... మద్యం మత్తులో లేడీస్ హాస్టల్ వద్ద ఏపీ మంత్రి తనయుడి వీరంగం!

సోమవారం, 1 ఆగస్టు 2016 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర పోకిరీల కంటే... మంత్రుల తనయులు ఆగడాలు మరింతగా శృతిమించిపోతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు ఓ ముస్లిం మహిళ చేయి పట్టుకునిలాగినట్టు కేసు దాఖలైంది. ఇపుడు తాజాగా మరో మంత్రి తనయుడు.. పీకల వరకు మద్యం సేవించి లేడీస్ హాస్టల్‌ వద్ద హల్‌చల్ సృష్టించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆ మంత్రిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో అత్యంత కీలకంగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆ మంత్రి సుపుత్రుడు ఫుల్లుగా మద్యం సేవించి ఒళ్లు తెలియనంత మత్తులో ఓ లేడీస్ హాస్టల్ వద్ద నానా రభస చేశాడు. ఆ మత్తులో అతడు ఏకంగా లేడీస్ హాస్టల్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. 
 
అయితే మంత్రి గారి కుమారుడి అరుపులు, కేకలతో అక్కడికి సమీపంలో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్‌కు చెందిన యువకులు అక్కడికి చేరుకుని మంత్రి కుమారడిని అడ్డుకునే యత్నం చేసినట్టు సమాచారం. అయినా వినని మంత్రిగారి పుత్రుడు లేడీస్ హాస్టల్‌లోకి చొరబడేందుకే యత్నించాడట. దీంతో లాభం లేదని భావించిన ఆ యువకులు నేరుగా పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... మంత్రిగారి పుత్రుడిని చూసి చేసేదేమీ లేక మందలించి ఇంటికి పంపారట. అయితే, ఈ మంత్రి పేరు, ఆయన సుపుత్రుడి పేరును విద్యార్థులు బహిర్గతం చేయలేదు. 

వెబ్దునియా పై చదవండి