సాక్షులందరూ చనిపోతున్నారు.. నా ప్రాణాలకు ముప్పుంది : దస్తగిరి

ఠాగూర్

బుధవారం, 12 మార్చి 2025 (14:54 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని సాక్షులంతా ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా చనిపోతున్నారని, అందువల్ల ఈ కేసులో అప్రూవర్‌గా మారిన తనకు ప్రాణాలకు ముప్పు పొంచివుందని డ్రైవర్ దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, తనకు భద్రత పెంచాలని కోరుతూ ఆయన కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాడు. 
 
తన ప్రాణాలకు ముప్పు పొంచివుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో తనకున్న భద్రతను తగ్గించారని, వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నాడు. అసెంబ్లీలో కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని, సాక్షుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నాడు. 
 
గతంలో కడప జైలులో డాక్టర్ చైతన్య రెడ్డి తనను బెదిరించారని కూడా దస్తగిరి తన వినతిపత్రంలో పేర్కొన్నాడు. కొత్త ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తంచేశాడు. గతంలో ఉన్న భద్రతనే ఇపుడూ కొనసాగించాలని కోరాడు. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2019 నుంచి ఇప్పటివరకు ఆరుగురు కీలక సాక్షులు మరణించడంతో వారి మరణాల వెనుక గల కారణాలను నిగ్గు తేల్చడానికి కడప జిల్లా ఎస్పీ ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. 
 
ఇందులో జమ్మలమడుగు, పులివెందుల డీఎస్పీలతో పాటు ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లు ఈ బృందంలో ఉన్నారు. టెక్నికల్, ఫోరెన్సిక్ నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు. గత ఆరేళ్లకాలంలో వివిధ కారణాలతో మరణించిన ఆరుగురు సాక్షుల మరణాలు సహజమైనవా? కావా? అనే కోణంలో ఈ బృందం దర్యాప్తు చేయనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు