అంగళ్లు కేసులో జగన్ సర్కారుకు చెంప ఛెళ్లుమనిపించిన సుప్రీంకోర్టు

మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:57 IST)
చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన గొడవలు, ఘర్షణాత్మక చర్యల కేసులో ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెంప ఛెళ్లుమనిపించింది. ఈ సంఘటనలు జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం, పోలీసులే ఫిర్యాదులు.. పోలీసులు సాక్షులుగా ఎలా ఉంటారని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నిస్తూ, ఈ కేసులో ఏపీ సర్కారు తరపున దాఖలైన ఆరు పిటిషన్లను అపెక్స్ కోర్టు కొట్టిపారేసింది. పైగా, అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ అంశంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 
 
'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరిట గత నెల 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్నప్పుడు వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసుల్లో పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం కొందరికి బెయిల్ లభించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది. టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ బాబు, నల్లారి కిశోర్ కుమార్రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‍ను రద్దు చేయాలని కోరింది. చల్లా బాబుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది.
 
మంగళవారం విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయడం అభ్యంతరం తెలిపింది. భద్రత కల్పించే పోలీసులే.. సాక్షులుగా ఎఫ్ఎస్ఐఆర్ ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసు అధికారులు గాయపడ్డారని.. ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. స్పందించిన ధర్మాసనం పోలీసులే ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి... పోలీసులే సాక్షులుగా ఉంటారా? అని ప్రశ్నించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చినందున దీనిలో జోక్యం చేసుకోడానికి ఏమీ లేదన్న స్పష్టం చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఆరు వేర్వేరు పిటిషన్లను కొట్టివేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు