వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ దూకుడు

శుక్రవారం, 1 నవంబరు 2019 (07:47 IST)
ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య బంధం తెగిపోయిన తర్వాత …వైసీపీ, బీజేపీ మధ్య స్నేహం పెరిగింది. 2018లో బీజేపీ 3 ముక్కలుగా ఉండేది. టీడీపీ అనుకూల బీజేపి, వైసీపీ అనుకూల బీజేపీ, పక్కా బీజేపీ అనే 3 వర్గాలుగా విడిపోయి ఉండేవారు నేతలు.

అయితే కొద్దికాలంగా వైసీపీని సమర్ధించిన నేతల స్వరంలోనూ మార్పు కనిపిస్తోంది. జీవీఎల్, విష్ణువర్దన్ రెడ్డి, రఘురాం లాంటి నేతలు నిన్నటి వరకు కొంత ప్రొ వైసీపీగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ల కూడా ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్ధాయిలో గళం ఎత్తుతున్నారు.

ఇక మొదటి నుంచి వైసీపీపై దూకుడుగానే వ్యవహరిస్తున్నఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రత మరింత పెంచారు.
 
ప్రస్తుత రాష్ట్ర ఖజానా ముఖచిత్రాన్ని ఆయుధంగా చేసుకుని వైసీపీపై యుద్ధం మొదలుపెట్టారు కమలనాథులు. అటు నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రభుత్వాన్ని మరిన్ని చిక్కుల్లోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు కూడా రంగంలోకి దిగాయి. ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితిని ప్రశ్నిస్తూ లేఖలు రాయడం ప్రారంభించాయి.

నిన్న స్టేట్ బ్యాంక్, నేడు హాడ్కో లేఖలు రాయడం ఈ కోవలోనివే అంటున్నారు విశ్లేషకులు.ఈ విధంగా లేఖలు రాయడం గతంలో ఎన్నడూ లేదని.. కేంద్రం అనుమతితోనే ఇలా జరుగుతోందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ లేఖల కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దివాళ దిశగా సాగుతుందని రుణ దాతలు గ్రహిస్తే.. అప్పులు పుట్టడం కష్టసాధ్యమయ్యే అవకాశం ఉంది.

ఈ పరిస్థితిని బీజేపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలో బీజేపీ ద్విముఖ వ్యూహంతో అడుగులు వేస్తోంది. టీడీపీతో పాటు వైసీపీలోని అసంతృప్తులకూ గాలం వేయాలనే వ్యూహారచన అమలు చేస్తోంది. రాష్ట్రంలో సంస్ధాగతంగా బలపడేదిశగా పక్కా ప్లాన్‌తో వెళ్తోంది. బీజేపీలో చేరితే మీ భద్రతకు ఢోకా ఉండదంటూ ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీలోని అసంతృప్తులను కూడా ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. భవితకు భద్రం, మీ క్షేమానికి మా భరోసా అనే నినాదంతో ముందుకెళ్ళాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. 2024 ఎన్నికల్లో వైసీపీతో పోరాటానికి బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు