ప్ర‌ధాని మోదీ జ‌న్మ‌దినాన‌... పారిశుధ్య కార్మికుల‌కు పాద‌సేవ‌

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (11:16 IST)
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్ర‌ధాని మోదీ జ‌న్మ‌దిన వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించింది. విజయవాడలోని చిట్టి నగర్ లోని నగరాల కళ్యాణ మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వ‌హించారు. గొలగాని ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను బహూకరించి ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వారికి పాద సేవ చేశారు. కార్మికుల కాళ్ళు క‌డిగి, కండువాతో తుడిచారు. 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఈ సంద‌ర్భంగా మాట్టాడుతూ, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవడం గర్వ కారణమ‌న్నారు. గొలగాని చారిటబుల్ ట్రస్టు అధినేత గొలగాని రవి కృష్ణ ఔదార్యం తో నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు బహూకరించార‌ని చెప్పారు.
 
 గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా భారతదేశం అభివృద్ధి వైపు దూసుకుపోతోంద‌ని, విజయవాడలో రహదారుల అభివృద్ధి కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు మంజూరు చేశార‌ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నార‌ని, ముఖ్యమంత్రి దానిని అభినందించలేక పోతున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల‌ని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం గుర్తించాల‌న్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు