ఏపీ రాజధాని అమరావతే అని తీర్మానం చేశారు.. మరిచిపోవద్దు.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

వరుణ్

బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (09:46 IST)
భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ కోర్ కమిటీ సమావేశం తాజాగా విజయవాడలో జరిగింది. ఇందులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ కమిటీ సమావేశంలో ఏపీ రాజధానిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని తీర్మానం చేశామని, ఈ విషయాన్ని ఎవరూ మిరిచిపోవద్దని సూచించారు. పైగా, రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని ఆయన ప్రకటించారు. 
 
అంతకుముందు ఏలూరులో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విపక్షాల విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. మూడో సారే కాదు, ఆ తర్వాత కూడా నరేంద్ర మోడీనే ప్రధాని అని ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి మోడీ సర్కారు కృషి చేస్తుందని చెప్పారు.
 
ఇప్పటివరకు తమ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ పదేళ్లలో దేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడడడం బీజేపీ సర్కారు వల్లేన జరిగిందని వివరించారు. బీజేపీ ఏం చెబుతుందో అదే చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాం... జమ్మూ కాశ్మీర్‌ను ఈ దేశంలో భాగం చేస్తాం అని చెప్పాం... ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తామని చెప్పాం... చేసి చూపించాం అని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. 
 
ఈ బహిరంగ సభలో రాజ్‍నాథ్ సింగ్ అయోధ్య రామ మందిరం గురించి ప్రస్తావించగానే... జై శ్రీరామ్ నినాదాలతో సభ నిమిషం పాటు మార్మోగిపోయింది. దాంతో రాజ్‌నాథ్ చిరునవ్వుతో ఆ నినాదాలను ఆస్వాదించారు. అనంతరం ఆయన ప్రసంగం కొనసాగిస్తూ... కొన్ని ప్రభుత్వాలు అధికారం కోసం రాజకీయాలు చేస్తాయని, మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం రాజకీయాలు చేస్తుందన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించి భారతీయుల కలను సాకారం చేశామన్నారు. దేశ ప్రజలు మోడీ వెన్నంటే ఉన్నారని స్పష్టం చేశారు.
 
ఆర్థికంగా ఆ బలహీన దేశం అనే ముద్ర నుంచి భారత్‌ను బయటికి తీసుకువచ్చి ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగాను నిలిపిన ఘనత మోడీ సర్కారుకే సొంతమని అన్నారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు