రాజధాని రైతులకు భారీ ఊరట... జగన్ సర్కారు నోటీసులు కొట్టేసిన హైకోర్టు

వరుణ్

మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (17:36 IST)
అమరావతి రాజధాని రైతులకు భారీ ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక ఆ ప్లాట్లను రద్దు చేశారు. ప్లాట్లను రద్దు చేస్తున్నట్టు సీఆర్డీయే, రెవెన్యూ అధికారులు 862 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 
 
ప్లాట్ల రద్దు అన్యాయం అంటూ ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ప్లాట్లు రద్దు చేయడం అంటే సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్లు తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని విన్నవించారు. ప్లాట్ల రద్దు నిర్ణయం రాజధాని మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. 
 
ఈ తీర్పుపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కమిషనర్, డిప్యూటీ తాహసీల్దారు ఇచ్చిన పాట్ల రద్దు నోటీసులను చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు