వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో జగన్ ప్రయాణించిన కారు ముందు చక్రాల కింద చీలి సింగయ్య అనే వృద్ధుడు పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో జగన్పై కేసు నమోదు చేసినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఆదివారం రాత్రి ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీన జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడివున్న చీలి లింగయ్యను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతుని భార్య లూర్ధు ఫిర్యాదు మేరకు తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్న వారు తీసిన వీడియోలను పరిశీలించాం. మాజీ సీఎం జగన్ వాహనం కింద లింగయ్య పడినట్టు వీడియోలో ఉంది. ఆ దృశ్యాలు చూశాక మళ్లీ సెక్షన్లు మార్చి కేసు నమోదు చేశాం. మాజీ సీఎం జగన్, ఆయన కారు డ్రైవర్ రవాణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజనీలపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దొరికిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తున్నాం. తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్లేందుకు జగన్ 14 వాహనాలకు అనుమతిఇచ్చాం. కానీ, తాడేపల్లి నుంచి కాన్వాయ్ మొదలైనపుడు 50 వాహనాల్లో అనుమతిగా వచ్చారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.